రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు

ఏలూరు, రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో 137 వ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు స్థానిక మార్కెట్ యార్డ్ లోని ఐ.ఎఫ్.టి.యు కార్యాలయం వద్ద, ఏలూరు వన్ టౌన్ మార్కెట్ సెంటర్ లోనూ, మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ వద్ద, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి మొత్తం సమాజాన్ని విముక్తి చేయడం కోసం పునరంకితమవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో, పెట్టుబడిదారీ దేశాలలో 8 గంటల పని దినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికిగురవుతున్నాయన్నారు.వేతనాలు, బోనస్, పింఛన్లు కోతకు గురవుతున్నాయని, పూర్తి పెన్షన్ పొందేందుకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారని, కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కుపైన దాడి జరుగుతోందన్నారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే,మా శక్తికి కూడా పరిమితులుంటాయని, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనమన్నారు. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు, హమాలీ వర్కర్లు పాల్గొన్నారు.