IPL 2021: సన్‌రైజర్స్‌పై చెన్నై ఘన విజయం

 ఐపీఎల్‌ 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్‌ గైక్వాడ్‌(75: 44 బంతుల్లో 12 ఫోర్లు), డుప్లెసిస్‌(56: 38 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో చెన్నై లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.

పసలేని రైజర్స్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న చెన్నై ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను ఛేదించింది. ముఖ్యంగా చెన్నై ఓపెనర్లు బ్యాటింగ్‌ ఆకట్టుకున్నది. ఓపెనర్లు ఔటైనా చివర్లో జడేజా(7నాటౌట్‌), సురేశ్‌ రైనా(17 నాటౌట్‌) లక్ష్యాన్ని పూర్తి చేశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, హైదరాబాద్‌ మరో ఓటమితో అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది.

అంతకుముందు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(57: 55 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మనీశ్‌ పాండే(61: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకాలతో రాణించడంతో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ చివర్లో కేన్‌ విలియమ్సన్‌(26 నాటౌట్‌: 10 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌), కేదార్‌ జాదవ్‌(12 నాటౌట్‌: 4 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌) దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా కరన్‌ ఒక వికెట్ పడగొట్టాడు.