వెంగన్నపాలెం గ్రామానికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం చెయ్యకపోవడం దారుణం: బొటుకు రమేష్ బాబు

దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం, దోసకాయలపాడు నుండి తోట వెంగన్నపాలెం గ్రామానికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం చెయ్యకపోవడం దారుణమని జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బోటుకు రమేష్ బాబు అన్నారు. జనసేన పార్టీ తాళ్లూరుమండల కమిటీ అధ్యక్షులు కూటాల ప్రసాద్ మరియు గ్రామస్థులతో కలిసి ఆయన రోడ్డును పరిశీలించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలపైబడినప్పటికీ, అభివృద్ధి లక్ష్యంతో ప్రకాశం ప్రత్యేక జిల్లాగా ఏర్పడి అయిదు దశాబ్దాలు దాటినప్పటికీ, ఇంతవరకు దర్శి-చీమకుర్తి మెయిన్ రోడ్డుకు కేవలం ఒక కిలోమీటర్ దూరం మరియు జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి అతి దగ్గరలో వున్న ఈ గ్రామం రోడ్డు వసతికి నోచుకోకపోవడం మన పాలకుల పనితీరుకు నిదర్శనమని, అటువంటి నాయకులను గెలిపించిన ప్రజలు దీనిని గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలు మరియు మంత్రులుగా ప్రాతినిధ్యమున్నా న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని, కనుక ప్రస్తుత ప్రభుత్వమైనా యుద్ధప్రాతిపదికన ప్రమాదకరంగా వున్న ఈ రోడ్డును బాగుచేసి ప్రజలకు న్యాయం చేయమని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ తాళ్లూరు మండల కమిటీ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలుగా ఇబ్బందులు పడుతున్నామని గౌరవ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ దీనికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజల కస్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేసారు.