గిరిజన ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ

* జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
* పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ, గిరిజన నేత నిమ్మల నిబ్రం

గిరిజన ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గిరిపుత్రుల ఉన్నతి కోసం ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు పూర్తిగా విస్మరించిందన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు, గిరిజన నాయకులు నిమ్మల నిబ్రం తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరారు. మనోహర్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పాలకుల దాష్టికాలపై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూనివర్సిటీతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటు, వంశధార ప్రాజెక్టు పెండింగ్ పనులు, ఇటీవల కాలంలో పాలకొండ ప్రాంతంలో చోటు చేసుకున్న వాలంటీర్ల దాష్టికాలను పార్టీ శ్రేణులు మనోహర్ గారికి వివరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పార్టీ నాయకులు పిసిని చంద్రశేఖర్, గర్బాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.