వైఎస్సార్‌కు నివాళులర్పించిన జగన్, షర్మిల

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు ఈ ఉదయం చేరుకున్న జగన్, షర్మిల, వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌కు నివాళులు అర్పించిన వారిలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఉన్నారు.

అంతకుముందు జగన్ ట్వీట్ చేస్తూ.. తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారని, వారి హృదయాల్లో కొలువై ఉన్నారని పేర్కొన్నారు. తన ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని అన్నారు.