విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం

ఎంతో ప్రాముఖ్యత కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది. ప్రైవేటు పరం చేయవద్దని పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నప్పటికీ.. కేంద్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పైగా ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం వాటా లేదని తేల్చి చెప్పింది.

మరోవైపు, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని చెప్పారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర పడిన వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడింది.