జాయింట్ కలెక్టర్ ఆనంద్ కు ఘనంగా వీడ్కోలు పలికిన జనసేన నాయకులు

  • కలెక్టర్ గా మళ్లీ మా జిల్లాకు రండి…!
  • జాయింట్ కలెక్టర్ గా మీ సేవలు అమోఘం
  • క్రమశిక్షణ, అంకితభావం కలిగిన అధికారి అరుదు
  • ఏడాది కాలంలోనే జిల్లా ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడాది పాటు దిగ్విజయంగా సేవలు అందించి బదిలీపై వెళ్లిన జాయింట్ కలెక్టర్ ఆనంద్ కు జనసేన పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు చెబుతూ.. కలెక్టర్ గా మళ్లీ మా జిల్లాకు రండి అని కోరారు. మంగళవారం రాత్రి విశాఖపట్నం బదిలీపై వెళ్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ కు జనసేన పార్టీ జిల్లా నాయకులు గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, రౌతు బాలాజీ నాయుడు, వెల్లంకి వెంకటేష్ తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ అంకితభావం కలిగిన అధికారులు అరుదుగా కనిపిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ జిల్లాకు అందించిన సేవలు అమోఘం అన్నారు. కార్యాలయంలో గాని క్షేత్రస్థాయిలో గాని ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి మార్గాలు వెతికి చర్యలు చేపట్టిన ఘనత దక్కించుకున్నారన్నారు. ఏడాది కాలంలోనే జిల్లా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అరుదైన వ్యక్తిగా కొనియాడారు. ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ తో పాటు కార్యాలయ వేళల్లో కూడా పని ఒత్తిడిలో ఉన్న ఎవరు ఏ సమస్య పరిష్కారం కోసం వచ్చినా.. వారిని సాదరంగా ఆహ్వానించి, సమస్య వివరంగా తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టే ఘనత దక్కించుకున్నారన్నారు. అలాగే జిల్లాలో ధాన్యం సేకరణ, భూముల రీ సర్వే, బిల్లులు చెల్లింపులు, భూ తగాదాలు తదితరు వాటిపై చూపిన చొరవ మరువలేదన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ చెప్పే సమస్యలను ఓపిగ్గావిని వాటి పరిష్కారానికి కృషిచేసి ప్రజలకు న్యాయం చేశారన్నారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాకు ఇంకా ఆనంద్ సేవలు అవసరమని జిల్లా కలెక్టర్ గా మళ్లీ పార్వతీపురం మన్యం జిల్లాకు రావాలని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ జనసేన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉందని, జిల్లా ప్రజలు తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వారు జాయింట్ కలెక్టర్ కు దుస్సాలుగా కప్పి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.