కాకినాడ నగరంలో జనసేనాని మరింత ఉత్సాహం నింపారు

  • జనసేన వారాహి యాత్ర విజయవంతం
  • జగన్ కాకినాడ నుంచి ముత్తాపై పోటీ చేయాలి
  • జనసేన డిమాండ్

కాకినాడ: కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ, రూరల్ పరిధిలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతం అయిందని, దాంతో కాకినాడ నగరంలో జనసేనాని మరింత ఉత్సాహం నింపారని జనసేన నాయకులు అన్నారు. అలాగే కాకినాడ సిటీలో సీఎం జగన్ వైకాపా తరఫున పోటీ చేస్తే ఆయనని ఓడించి జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తుపై ముత్తా శశిధర్ గెలుస్తారంటూ వారు చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం కాకినాడలోని జనసేన సిటీ కార్యాలయంలో జనసేన పిఎసి సభ్యుడు ముత్తా శశిధర్, నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్లతోపాటు జనసైనికులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా శశిధర్ మాట్లాడుతూ.. వారాహి యాత్ర విజయవంతం అయిందని పవన్ సర్పవరం సెంటర్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ పలు నిజాలను ప్రసంగించారన్నారు. జనవాణి కార్యక్రమంలో ద్వారంపూడిపై పలువురు ఫిర్యాదులు చేశారని చెప్పడంతోటే ఆయన అతనిని విమర్శించారన్నారు. ద్వారంపూడి తనపై కాకినాడ సిటీలో పవన్ పోటీ చేయాలంటూ పట్టుబడుతున్నారని, ఎన్నికలకు 10 నెలలు ముందుగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఏ పార్టీలో ఉండదని చెప్పారు. అలాగే కాకినాడ సిటీ నుంచి జనసేన పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పవన్ జనవాణి, ముస్లిం ఇతర వర్గాల సభలు నిర్వహించారన్నారు. ఉప్పుటేరు నుండి ఏటిమొగ వరకు బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయిలో పవన్ పర్యటించారని, వారి బాధలను చూసి చలించిపోయారన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ ఏటిమొగగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ తరఫున సీఎం జగన్ కాకినాడ సిటీ నుంచి ముత్తాపై పోటీ చేయాలని నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తలాటం సత్య, మడ్డు విజయ్, శ్రీమన్నారాయణ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.