ఉపాధ్యాయులను గౌరవంగా చూడండి: ముఖరంచాంద్

రాజంపేట, చదువు చెప్పే గురువులను పోలీస్ స్టేషన్లో బంధిస్తారా? ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు ఎక్కడైనా పెరుగుతాయే కాని తగ్గవు కాని వైసీపీ పాలకులు తగ్గించారు.! ఉద్యోగులు సమైక్యంగా… బలంగా పోరాడాలి. పే రివిజన్ కమిషన్ అనే పేరును కాస్తా పే రివర్స్ కమిషన్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుల జీతాలను తగ్గించే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. జీతభత్యాల్లో కోతలు విధించడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న పోరాటాన్ని అణచివేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. నిరసన చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని పాలకులు గద్దె మీద ఉండటం మన దురదృష్టం. మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను పూజించుకోవడం భారతీయ సంస్కృతి. వైసీపీ పాలనలో చదువు చెబుతున్న ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్లో బంధించడం అప్రజాస్వామికం. నిన్నటి నుంచే ప్రతి ఉపాధ్యాయుడికీ పోలీసులు నోటీసులు ఇవ్వడం, గృహ నిర్బంధాలు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందనే విషయం అర్థం అవుతోంది. వైసీపీ పాలకులు ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎన్ని అడ్డదారులను ఎంచుకొంటున్నారో… అన్నీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై ఉపయోగిస్తున్నారు. చర్చల పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులను మభ్యపెట్టారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని ఉద్యోగులు ఇప్పటికే గ్రహించారు. అన్ని సంఘాల వాళ్ళు ఒక తాటి మీదకు వచ్చిన సమైక్యంగా ఉండాలి. బలమైన పోరాటం ద్వారా ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాల్సిన బాధ్యతను ఇప్పుడు ప్రతి ఉద్యోగి తీసుకోవాలి. పోలీసులకు ఒక విన్నపం. మనందరికీ, మన పిల్లలకు చదువు చెప్పే గౌరవ స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు చేసే పోరాటం తమ కోసం మాత్రమే కాదు. మీ పోలీసుల కోసం కూడా… కాబట్టి వారిని కేసుల పేరుతో, అరెస్టుల పేరుతో వేధించవద్దు. ఉపాధ్యాయులను గౌరవంగా చూడండి. పాలకపక్షం నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు ప్రజాస్వామ్య విధానాలను… గురువును పూజించే సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవాలని కోరుచున్నామని ముఖరంచాంద్ అన్నారు.