స్థానిక వైసిపి నాయకుల పిచ్చి పరాకాష్టకు చేరింది: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గంలో బుధవారం స్థానిక వైసిపి నాయకులు మూడు రాజధానులకు మద్దతుగా పూజలు చేస్తూ వింత ఆచారానికి తెర తీశారు. ఆ పూజ చేసిన వ్యక్తులు కూడా కేవలం జోగి రమేష్ అక్రమ మట్టి దందా ఏజెంట్లు, స్థానిక సంస్థల్లో వివిధ నామినేటెడ్ పోస్టులు పొందిన వ్యక్తులు, లేదా ప్రస్తుత కాంట్రాక్టర్లు మాత్రమే ఉన్నారు. పూజ చేసిన వ్యక్తులను ఒకటి అడుగుతున్నా నిజంగా మీలో ఎవరైనా రైతులు ఉంటే మీరు అమరావతి రాజధానికి భూమి ఇచ్చుంటే ఆ బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. తన స్వార్థం కోసం, తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం పిచ్చిపిచ్చి డ్రామాలాడుతున్న జోగి రమేష్. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే పెడన నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా మరిచి మీరు చేస్తున్న వెర్రి చేష్టలకు జనాలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. మీరు పూజ చేయవలసింది మూడు రాజధానులకు మద్దతుగా కాదు. మీ అధినాయకుడు మాటిచ్చి మడం తిప్పి జనాలను మోసం చేసినందుకు పశ్చాతాపంగా మమ్మల్ని క్షమించండి అని ముక్కోటి దేవతలకు మొక్కాలి. మీ జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాట ఇచ్చి ఇప్పటివరకు సిపిఎస్ రద్దు చేయని మా అధినాయకుడ్ని క్షమించండి అని మీరు పూజలు చేయాలి. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తానని మాట తప్పి కేంద్రం ముందు మెడ వంచి ఆంధ్ర ప్రజలను మోసం చేసినందుకు మీరు సిగ్గుతో క్షమించమని పూజలు చేయాలి. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, ఇప్పుడు దశలవారీగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులను నైవంచన చేసినందుకు పొర్లు దండాలు పెడుతూ మమ్ములను క్షమించమని పూజలు చేయాలి. మీ నాయకుడికి ఉద్యోగం లేనప్పుడు, నాకు ముఖ్యమంత్రి ఉద్యోగం ఇస్తే నిరుద్యోగులకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మబలికి ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని కొట్టేసిన మీ జగన్ రెడ్డి మోసాన్ని క్షమించమని మీరు మోకాళ్లతో నడుస్తూ పూజలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడే జగన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారు. నిజంగా మీరు పూజలు చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యుల కోసమో లేదా నియోజకవర్గ ప్రజల కోసం చేయండి అందరం సంతోషిస్తాం. అంతేగాని ఇలా అర్థం పర్థం లేని పూజలతో పూజా విధానాన్ని, దేవతలను అవమానించకండి అని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.