Anantapuram: ఎస్.ఎస్.బి.ఎన్. కాలేజీ విద్యార్థులపై లాఠీఛార్జ్ గర్హణీయం శ్రీ నాదెండ్ల మనోహర్

ఎయిడెడ్ విద్యా సంస్థల ఆందోళనలు ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా మారుస్తారా..?

ఎస్.ఎస్.బి.ఎన్. కాలేజీ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ గర్హణీయం

రాష్ట్ర ప్రభుత్వమే సమస్యకు బీజం వేసి… దాన్ని శాంతిభద్రతల సమస్యగా మారుస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో కోరారు. సజావుగా సాగుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులు, తల్లితండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసివేయవద్దని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అనంతపురంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఎస్.ఎస్.బి.ఎన్. కాలేజీని ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికం. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఒక విద్యార్థిని తలకు బలమైన గాయమైంది అంటే ఆ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్థం అవుతోంది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు పడుతున్న ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని ఒక శాంతిభద్రతల సమస్యగా మార్చాలనుకోవద్దు. ఎందరో దాతలు విద్యాభివృద్ధి కోసం ఆస్తులు దానం చేసి పేదలకు విద్యను చేరువ చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల ఎంతో చరిత్ర ఉన్న పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని శ్రీ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.