ఉయ్యాలవాడలో పీఎం వాణి సేవలు ప్రారంభించిన మంత్రి బుగ్గన

త్యాగానికి ప్రతి రూపంగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డి, నరసింహారెడ్డి వంటి మహనీయులు జన్మించిన ఉయ్యాలవాడకు ‘పీఎం వాణి (ప్రధాన మంత్రి- వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌)’ సేవలు రావడం హర్షణీయమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. దేశంలో ప్రతి పల్లెను స్మార్ట్‌ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో కేంద్రం చేపట్టిన పీఎం-వాణి గ్రామ యూనిట్‌గా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఆదివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలిలో విప్‌ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డితో కలిసి బుగ్గన ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామంగా అవతరించిన ఉయ్యాలవాడ అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. చిన్న వ్యాపారులు వైఫై ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు అన్నారు. గంగుల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ సి-డాట్‌, వైడాట్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ సేవలు గతంలో వాడే టెలిఫోన్‌, పబ్లిక్‌ బూత్‌ తరహాలో ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీఎం వాణి సీఈవో సంజీవ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.