నందిగ్రామ్ నా లక్కీ ప్లేస్.. అక్కడ్నించే పోటీ చేస్తా..

వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. లోగడ నందిగ్రామ్ లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మమత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడి నుంచి తను తిరిగి పోటీ చేస్తానని, ఇది తన లక్కీ ప్లేస్ అని ఆమె సోమవారం పేర్కొన్నారు. ఈమెకు మాజీ సన్నిహితుడైన సువెందు అధికారి నియోజకవర్గమిది. కానీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఇలా ప్రకటన చేయడంద్వారా దీదీ ఆయనకు గట్టి సవాల్ విసిరినట్టయింది. గత ఎన్నికల్లో మమత కోల్ కతా లోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అవసరమైతే తాను ఇక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని, కానీ ఈ నియోజకవర్గంలో మరో మంచి అభ్యర్థిని నిలబెడతానని ఆమె చెప్పారు. 2011 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నందిగ్రామ్ లో ఎకనామిక్ జోన్ ప్రాజెక్టు నుంచి రైతుల భూమిని పరిరక్షించేందుకు మమత ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫలించి ఘన విజయం సాధించారు. అక్కడ లెఫ్ట్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా సువెందు అధికారిని ఎదుర్కొనేందుకు ఆమె నందిగ్రామ్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం విశేషం.

అయితే ఆమె నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. నందిగ్రామ్ లో రైతులమీద కాల్పులు జరిపిన ఓ పోలీసు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకోలేదా అని బీజేపీ నేతలు అన్నారు. నందిగ్రామ్ ఘటనలో 14 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.