రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఖేల్ రత్న’ అందుకున్న నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’ పేరును ఇటీవల కేంద్రం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా మార్చడం తెలిసిందే. పేరు మార్చిన తర్వాత తొలిసారిగా ఇవాళ ‘ఖేల్ రత్న’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ఒలింపిక్ జావెలిన్ యోధుడు నీరజ్ చోప్రా, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

హాకీ ఆటగాళ్లు మన్ ప్రీత్ సింగ్, శ్రీజేష్, రవికుమార్ (రెజ్లింగ్), సునీల్ ఛెత్రీ (ఫుట్ బాల్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్), అవని లేఖర (పారా షూటర్), సుమీత్ ఆంటిల్ (పారా జావెలిన్ త్రోయర్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్ ప్లేయర్), కృష్ణా నాగర్ (పారా బ్యాడ్మింటన్ ప్లేయర్), మనీష్ నర్వాల్ (పారా షూటర్) కూడా ‘ఖేల్ రత్న’ అందుకున్నారు.