పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు, సోము వీర్రాజు

కరోనా బారినపడ్డ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం పవన్‌ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పవన్‌ ఆరోగ్యం వెంటనే కుదుటపడాలని ఆకాంక్షించారు. ఇటీవల సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో చికిత్స పొందుతున్నారు. ఖమ్మంకు చెందిన వైరల్‌ వ్యాధుల నిపుణుడు, కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్‌ తన అభిమానులకు తెలియజేశారు.