రాష్ట్రానికి పట్టిన వైసీపీ దెయాల్ని పవన్ కళ్యాణ్ వదిలిస్తారు

  • వైసీపీ నేతలు రాష్ట్రాన్ని పిశాచాల్లా పీక్కుతింటున్నారు
  • అన్నం పెట్టే రైతన్న కాదు దెయ్యం అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ నేతలే కొరివి దెయ్యాలు, శాడిస్ట్ దెయ్యాలు
  • రాష్ట్రం నుంచి వైసీపీ దెయ్యాల్ని వదిలించే సమయం ఆసన్నమైంది
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ దెయ్యాలను త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వదిలిస్తాడని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రాజధాని అమరావతిలో దేవతలు లేరని దెయ్యాలు మాత్రమే ఉన్నాయని మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాధ్ చేసిన వ్యాఖ్యలపై శనివారం ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ప్రవర్తన లోనూ , ఆకారంలోనూ, వేషధారణలోనూ, మాటల్లోనూ దెయ్యాల్లా ఎవరు ప్రవర్తిస్తున్నారో రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు అమరావతే రాష్ట్ర రాజధాని అని అందుకే జగన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ శ్మశానంలో దెయ్యాలుగా ఉన్నారన్నారు. అసలు రాష్ట్రానికి పట్టిన దెయ్యాలు అమరావతి రైతులు కాదని మీ ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులేనన్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని చంపేసి పైశాచిక ఆనందం పొందుతున్న శాడిస్ట్ దెయ్యాలు వైసీపీ నేతలేనని దుయ్యబట్టారు. ముప్పైవేల మంది రైతుల త్యాగాన్ని ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ఆశల్ని సమాధి చేయటానికి కంకణం కట్టుకున్న మీరే కొరివి దెయ్యాలని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి పట్టిన దెయ్యాలని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని, దెయ్యాల్ని రెండింటినీ త్వరలోనే వదిలిస్తాడని ఆళ్ళ హరి అన్నారు.