కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు.. అభిమానులు ఆయన త్వర గా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్ధిస్తున్నారు. ప్రస్తుతం పవన్ హైదరాబాద్‏లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తొలిసారి తన ఆరోగ్య పరిస్థితిపై స్పంధించాడు. కరోనా భారిన పడిన తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని.. వీలైనంత త్వరగా కోలుకోని మీ ముందుకు వస్తానని తెలిపారు. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పవన్‌ సూచించారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ జనసేనాని కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం నా ఆరోగ్య కుదుటపడుతోంది. వైద్యుపల సలహాలు పాటిస్తున్నాను. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసినప్పటి నుంచి అందరు నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతున్ని కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. సందేశాలు పంపించారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను అని తెలిపారు.