RCB vs KKR: దూసుకుపోతున్న బెంగళూరు.. ఐపీఎల్ లో హ్యాట్రిక్
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 14వ సీజన్ లో వరుసగా మూడో విజయం సాధించింది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా 20 ఓవర్లలో 166/8కే పరిమితమైంది. రసెల్(31; 20 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(29; 23 బంతుల్లో 1×4, 2×6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా, ఆది నుంచీ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్కతా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దాంతో చివర్లో సాధించాల్సిన రన్రేట్ పెరిగి ఒత్తిడిలో చిత్తయింది. ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్ మూడు, చాహల్ రెండు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మాక్స్వెల్(78; 49 బంతుల్లో 9×4, 3×6), డివిలియర్స్(76*; 34 బంతుల్లో 9×4,3×6) దంచికొట్టారు. ఓపెనర్ విరాట్ కోహ్లీ(5), వన్డౌన్ బ్యాట్స్మన్ రజత్ పాటిదార్(1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరినా.. దేవ్దత్ పడిక్కల్(25; 28 బంతుల్లో 2×4)తో కలిసి మాక్సీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీ రిద్దరూ మూడో వికెట్కు 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 95 పరుగుల వద్ద పడిక్కల్ ఔటయ్యాక.. డివిలియర్స్తో జోడీ కట్టిన మాక్సీ దూకుడుగా ఆడాడు. అయితే, కమిన్స్ వేసిన 17వ ఓవర్లో పుల్షాట్ ఆడబోయి హర్భజన్ చేతికి చిక్కాడు. అప్పటికి ఆర్సీబీ స్కోర్ 148/4గా నమోదైంది. ఇక చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. కైల్ జేమీసన్(11*)తో కలిసి 18 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిద్ద్ చెరో వికెట్ పడగొట్టారు.