డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు: తెలంగాణ హైకోర్టు

డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. ఓ వాహనదారు మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని స్పష్టం చేసింది. అతడి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని ఆదేశించింది.

ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి తరఫున ఎవరూ రాకపోతే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తర్వాత వాహనాన్ని అప్పగించాలని పేర్కొంది. అతడి వెంట మద్యం తాగని వ్యక్తి ఉంటే అతడికి వాహనం ఇవ్వొచ్చని వెల్లడించింది. అంతేతప్ప, మద్యం మత్తులో డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది.