కేంద్రం నిధులతో నడిచే అన్ని విద్యాసంస్థల్లో పరీక్షలు వాయిదా!

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని విద్యాసంస్థల్లో మే నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆయా విద్యాసంస్థల చీఫ్‌లకు విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖారే లేఖ రాశారు.

ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు మాత్రం అనుమతించారు. దీనిపై జూన్‌, 2021లో తిరిగి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆయా సంస్థల్లో ఎవరైనా ఎలాంటి సాయం కావాలని కోరినా వెంటనే అందించాలని ఆదేశించారు. తద్వారా వారు ఒత్తిడిలోకి జారకుండా చూడాలన్నారు.

అలాగే అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించాలని సంస్థల్ని కేంద్రం ఆదేశించింది. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని కోరింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.