ఈద్గా మైదానంలో వసతులు కల్పించండి: దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు, ఈద్గా మైదానంలో వసతులు కల్పించండి రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక నమాజుకు సంబంధించి ఆయా ఈద్గాల వద్ద ప్రత్యేకమైన వసతులు కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా బారాషహీద్ దర్గా ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక నమాజు నిర్వహిస్తారని, అన్ని ఈద్గా మైదానాలతో పాటు భారత్ షహీద్ దర్గా ఈద్గా మైదానంలో కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రత్యేకించి ఎండవేడి ఎక్కువగా ఉన్నందున ముందస్తుగా వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అలాగే ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు నగర కార్యదర్శి గాదంశెట్టి వెంకటేష్ నగర నాయకులు శ్రీధర్, మని, సాయి తదితరులు పాల్గొన్నారు.