వివాదంలో రవీంద్ర జడేజా

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. కరోనా రూల్స్‌ను అతిక్రమించిన విషయంలో మహిళా పోలీస్ తో వాగ్వాదం జరిగింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో రవీంద్ర జడేజా అతని భార్యతో కలిసి వెళ్తున్నారు. అయితే వారు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. ఈ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న జడేజా మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అతని భార్య రివాబా మాస్క్ ధరించలేదు.

దీంతో మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఆమెను సోనల్ అనే ఓ మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించింది. ఈ విషయంలో ఒకరికొకరికి మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాస్క్ ధరించనందుకు జరిమానా చెల్లించాల్సిందిగా సోనాల్ ఆదేశించారు. జరిమానాను నిరాకరిస్తూ రవీంద్ర జడేజా హెడ్ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరితో గొడవకు దిగాడు. మరోవైపు రవిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. కిషన్‌పర చౌక్‌లో జరిగిన ఈ ఘటన కారణంగా హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తనతో కానిస్టేబుల్‌ అతిగా వ్యవహరించిందని జడేజా కూడా పోలీసులకి తెలిపాడు.