పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రత..

జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉంటే 4979 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, 4187 గన్స్ డిపాజిట్ అయ్యాయని వెల్లడించారు. 3066 మంది రౌడీ షీటర్లను ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, సోషల్ మీడియా పై ప్రత్యేక నజర్ పెట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంటుందన్నారు. ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తామని, ఎలక్షన్ ఏజెంట్ కూడా అదే వాహనంలో వెళ్ళాలని సీపీ సూచించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే 9490617111 కు సమాచారం అందించాలని కోరారు.