‘అమ్మ ఒడి’కి మంగళం పాడేందుకే ఆంక్షలు

* నవ రత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోంది

వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకొనేందుకు సిద్ధమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకాన్ని క్రమంగా పక్కకు పెట్టేసేందుకే ఆంక్షలు విధిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పథకం నుంచి ఒక్క నయా పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. లబ్ధిదారులు ప్రశ్నిస్తే జులైలో ఇస్తాం అని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని ఇప్పటి నుంచే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడి కట్ చేస్తామని ప్రకటించారు. వేసవి కాలంలో విద్యుత్ వాడకం కచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటి వాడకం ప్రకారం చూస్తే కచ్చితంగా ఎక్కువ యూనిట్లు ఉంటాయి. కావాలనే ఈ సమయాన్ని ఎంచుకొని అమ్మ ఒడి పథకానికి పేద తల్లులను అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. పేదలు చాలా చోట్ల చిన్నచిన్న ఇళ్ళలో నివాసం ఉంటారు.. వాళ్ళకు నాలుగైదు వాటాలకు ఉమ్మడి మీటర్ ఉంటుంది. అప్పుడు కచ్చితంగా ఎక్కువ విద్యుత్ వాడకం నమోదు కావచ్చు. ఇలాంటి నిబంధనతో లబ్ధికి దూరం అవుతారు. అలాగే ఆధార్ కార్డులో జిల్లా పేర్లు మార్చుకోవాలి అనే నిబంధన కూడా ప్రజలను మండుటెండల్లో ఆధార్ కేంద్రాల ముందు నిలబెడుతుంది. కాయకష్టం మీద బతికేవాళ్ళు ఆధార్ కార్డులో మార్పులకు కచ్చితంగా పనులకు కనీసం రెండుమూడు రోజులు దూరం కాక తప్పదు. ఏదో విధంగా పేద తల్లులను అమ్మ ఒడికి దూరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. పథకం తొలి నుంచి కూడా ప్రభుత్వం మాట మారుస్తూనే ఉంది. పేద తల్లులు తమ బిడ్డలను చదివించుకొనేందుకు డబ్బులు ఇస్తాను అని ప్రచారంలో చెప్పుకొని… అమలు చేసే సమయంలో ఒక బిడ్డకే ఇస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి లబ్ధి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2022-23లో కూడా అమ్మ ఒడికి విద్యార్థులను దూరం చేసే పనిలో ఉన్నారు. క్రమంగా ఈ పథకానికి మంగళం పాడబోతున్నారు. ప్రణాళిక లేని వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన నవరత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతుందని ప్రజలు గ్రహిస్తున్నారని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.