కామన్ వెల్త్ గేమ్స్ లో భారత విజయాలు సంతోషదాయకం

* పారిస్ ఒలింపిక్స్ పోటీల్లోనూ ఈ విజయం కొనసాగాలి
బ్రిటన్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు, ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను మన క్రీడాకారులు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించింది. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించింది. ఈ విజయాలు క్రీడాభిమానులు, ఔత్సాహిక క్రీడాకారులలో నూతన ఉత్తేజాన్ని నింపాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా షటిల్ బాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడలలో మన క్రీడాకారులు చూపిన ప్రతిభ ముచ్చటగొలిపింది. ఈ పోటీలలో మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ గర్వకారణం. విజేతలైన తెలుగు బిడ్డలు పి.వి.సింధు, ఆచంట శరత్ కమల్, సాత్విక్ సాయిరాజ్, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మేఘన, రజని, హుస్సాబుద్దీన్, కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్ తోపాటు ఈ పోటీలలో పాల్గొన్న సుమిత్ రెడ్డి, జ్యోతిలకు తెలుగు ప్రభుత్వాలు ఉదారంగా నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ పోటీలలో మన క్రీడాకారులు విజయం సాధించడానికి వెన్నంటి ప్రోత్సహించిన కోచ్ లు, అధికారులకు అభినందనలు తెలుపుతున్నాను. 2024 లో పారిస్ లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలలో ఈ జైత్రయాత్ర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.