ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం కేసు విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలు ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా ఆరోపణలున్నాయి.