వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మోమిన్ పేటలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పది మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై దట్టమైన పొగమంచు ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతులు నితిన్, సోనాభాయ్, సంజీవ్, శ్రీనిభాయ్, రేణుకాభాయ్ లుగా గుర్తించారు. వీరంతా రోజు వారీ కూలీలు.