రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం

అబుదాబి వేదికగా బుదవారం రాత్రి ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టుకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్ దూకుడుకు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు చేరువైంది. ఉత్తమ ప్రదర్శన చేసిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు శుభారంభం అందించారు. పడిక్కల్‌ మెరుపులతో పవర్‌ప్లే ఆఖరికి 44/0తో నిలిచింది. ఫర్గుసన్‌ వేసిన ఏడో ఓవర్లో బెంగళూరు ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అరోన్‌ ఫించ్‌(16)..వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో బంతికి ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ అనూహ్యంగా రనౌటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ మరో బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌ తో కలిసి లక్ష్యాన్ని ఛేదించాడు. కోల్‌కతా బౌలర్లలో ఫర్గుసన్‌ ఒక వికెట్‌ తీశాడు.