విజయోస్తు..!

* అన్నవరం శ్రీ సత్యదేవుని సేవలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
* జనసేన వారాహి విజయ యాత్రకు సన్నద్ధమవుతూ ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ బుధవారం అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ సత్యదేవుని దర్శించి, పూజలు జరిపారు. జనసేన వారాహి విజయ యాత్ర ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతున్న తరుణంలో శ్రీ స్వామి వారి దర్శనంతో యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదట సత్యదేవుని సన్నిధిలోని త్రిమూర్తులకు, తదుపరి సత్యదేవుడి పాదాల చెంత స్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం సమీపంలో ఆలయ అర్చక స్వాములు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదాశీర్వచనాలు అందచేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యదేవుని పటం అందించారు. ఉదయం 10 గం.కు రత్నగిరి శ్రీ సత్యదేవుని సన్నిధికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పార్టీ పీఏసీ సభ్యులు, పలువురు నాయకులు సత్యదేవుని దర్శించుకున్న వారిలో ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేవుని దర్శనం కోసం వస్తున్నారని తెలుసుకుని జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అశేషంగా కొండ వద్ద బారులు తీరారు. రెండు రోజుల పాటు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన హోమ క్రతువు ముగించిన అనంతరం వారాహి యాత్ర చేపట్టేందుకు గత రాత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నవరం చేరుకున్న విషయం విదితమే.