‘స్వామి నోటికి తాళం, చేతికి కమండలం తప్పదు! – పొన్నా యుగంధర్

చిత్తూరు, గంగాధర నెల్లూరు, అవినీతి పరుడైన ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెపుతానని జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి పొన్నా యుగంధర్ సవాలు విసిరారు. అధికార బలంతో విర్రవీగుతున్న ఆయనకు తగిన శాస్తి చేయడానికి ప్రజలు సిద్దంగా వున్నారని చెప్పారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుతున్న ఆయన నోటికి తాళం వేస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అయన అనుచరులు అడ్డూ అదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బాధ్యత కలిగిన పదవిలో వున్న ఆయన అవినీతిపై వార్తలు రాస్తే కేసులు పెడతానని బెదిరరించడం సిగ్గు చేటన్నారు. అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చిన వారిని ప్రశంసించి విచారణకు ఆదేశించడం పోయి బెదిరించడం చూస్తే అతనికి అందులో భాగం ఉందని భావించవలసి వస్తున్నదని చెప్పారు. పత్రిక విలేకరులకు జనసేన అండగా ఉంటుంది, వారిపై కేసులు బనాయిస్తే సొంత ఖర్చులతో కోర్టులో వాదిస్తానని హెచ్చరించారు. 2019 వ సంవత్సరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ముగించడానికి గల కారణాలు ఏమిటి?? రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రగల్భాలు ఉత్తుత్తి వాగ్దానాలు పలికిన మీరు దాన్ని తుంగలో తొక్కి అవినీతికి ఆజ్యం పోశారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జగన్ మాటలకు మోసపోయిన ప్రజలు నారాయణ స్వామీ లాంటి వారిని కూడా గెలిపించారని వ్యాఖ్యానించారు. అయితే నిజం గ్రహించిన ఓటర్లు ఈ సారి ఓడించి కమండలం చేతికి ఇస్తారని జోస్యం చెప్పారు. ప్రజల కోసం, ప్రజా క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను ఓడించి చరిత్ర సృష్టించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యుగంధర్ చెప్పారు.