నేటి నుంచే టీ20 క్రికెట్ వార్
టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఐదేళ్ల విరామం తరువాత జరగనుంది. ఈ టీ20 ప్రపంకప్ కోసం నువ్వా.. నేనా.. అని తేల్చుకునేందుకు 12 దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి క్వాలిఫయింగ్ మ్యాచ్లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమవగా.. సూపర్-12 పేరుతో నేటి నుంచి ప్రధాన మ్యాచ్లు జరుగనున్నాయి. ఆరేసి జట్లతో రెండు గ్రూపులు ఉండగా.. ఆ రెండు గ్రూపుల్లోని జట్ల మధ్య రసవత్తరమైన పోరు సాగనుంది. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం 8 జట్లు(భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు) ముందే సూపర్ 12కు చేరగా.. మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్లో క్వాలిఫైడ్ మ్యాచ్లు నిర్వహించారు. ఈ మ్యాచ్ల్లో గెలుపొందిన శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్ 12 చోటు దక్కించుకున్నాయి. ఇక నేటి నుంచి జరుగనున్న అసలైన పోరులో ఒక్కో గ్రూప్లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్ల నుంచి టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్కు చేరుతాయి. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న దుబాయ్లో జరుగనుంది. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 22 వరకు జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో 8 జట్లు పోటీ పడ్డాయి. గ్రూప్ ‘ఎ’లో… ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, గ్రూప్ ‘బి’లో.. ఒమన్, పపువా న్యూగునియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ 8 దేశాలు మొత్తం 12 మ్యాచ్లు ఆడాయి. రెండు గ్రూపుల్లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు శ్రీలంక, నమీబియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 12 లీగ్కు చేరాయి.
సూపర్ 12 లో ఆడనున్న జట్లు ఇవే:
గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక
గ్రూప్ 2.: భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, స్కాట్ లాండ్, నమీబియా