టీ20 వరల్డ్‌కప్‌ తేదీలు ఖరారు

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ యూఏఈ, ఒమన్‌లో జరగనుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని ఐసీసీ మంగళవారం నాడు ప్రకటించింది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచ్​లు.. అబుదాబి, షార్జా, దుబాయ్, ఒమన్ వేదికగా జరగనున్నాయి.

టోర్నమెంట్ తొలి రౌండ్‌లో.. అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్‌, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు.. సూపర్‌12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయని ఐసీసీ తన ట్వీట్‌లో తెలిపింది. ఎమిరేట్స్‌, యూఏఈ వేదికల్లోనే టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఈ మ్యాచ్‌లను యూఏఈ, ఒమన్‌కు షిఫ్ట్ చేశారు.