జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని సోమవారం ఉదయం కామాక్షి నగర్, లక్ష్మి గణపతి ఆలయంలో జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్ కు, తెలుగు భాషా సేవాసంఘం అధ్యక్షులు ఆర్.బి. రామానాయుడుకు, ప్రముఖ సంఘసేవకులు, నడకసంఘం ఉద్యమకారులు డాక్టర్ ఎ. ఎస్. ప్రశకాశరావు మాస్టారుకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 డిప్యుటీ గవర్నర్ ఆరికతోట తిరుపతి రావు చేతులు మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ దేశభాషలందు తెలుగులెస్స అని, అమ్మలాంటి ఖమ్మనైన తెలుగును ప్రతీ తెలుగువాడు కాపాడాలని, అమ్మకే అమ్మ భాష నేర్పిన నిఖార్సు తెలుగువాడు, వ్యవహారిక భాషోధ్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, ఇటువంటి గొప్పదినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను పురస్కరించుకొని చేయటం మంచి పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చిరంజీవి యువత ప్రతినిధులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగు సతీష్, బూర్లి వాసు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,కార్యదర్శి, జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్, జనసేన నాయకులు శీరకుమార్, పత్రి సాయి కుమార్ పాల్గొన్నారు.