హుజురాబాద్‌ నామినేషన్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

హుజురాబాద్‌ లోని నామినేషన్‌ కేంద్ర వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్‌కు చివరిరోజు కావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. నామినేషన్‌ వేసేందుకు పెద్ద ఎత్తున వందలాది మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు తరలివచ్చారు. కాగా కాసేపట్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో కలిసి వెంకట్‌ స్వయంగా నామినేషన్‌ వేయనున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపఎన్నిక ఇంచార్జ్ జితేందర్ రెడ్డిలతో పాటు పలువురు నేతలతో కలిసి నామినేషన్‌ వేయనున్నారు.

కాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది. ఇదిలా ఉండగా తులెత్తి మొక్కుతాం. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నిరసనగా ఉపఎన్నికలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు భారీగా హుజూరాబాద్‌కు తరలివచ్చారు. అయితే తాము నామినేషన్లు వేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు.