రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం

• శాసనసభలో మనం ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు
• పాలకులు కనీస సంస్కారం మరచి రాజకీయాలు చేస్తున్నారు
• సమస్య మీద నిజాయతీగా మాట్లాడే శక్తి… శ్రీ పవన్ కళ్యాణ్
• ప్రజల కోసం చేసే అంతిమ పోరాటానికి అంతా అండగా నిలబడండి
• మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

శాసన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉండి ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చి ఉండేది కాదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పాలకులు కనీస సంస్కారం లేకుండా దారుణంగా రాజకీయాలు చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితుల్ని ఖండించాలన్నారు. మన భవిష్యత్తు కోసం.. రాష్ట్రం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల క్రితమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసినట్టు తెలిపారు. ఆయన దూరదృష్టిని అప్పట్లో ఎవరూ గ్రహించలేకపోయారన్నారు. ప్రస్తుతం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లినట్టు తెలిపారు. మన రాష్ట్రం కోసం.. మన భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నంలో మచిలీపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో పార్టీ పక్షాన గాంధీ జయంతి నిర్వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. బ్రిటీష్ కాలం నుంచి జిల్లా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ప్రతి పౌరుడు కృషి చేశారు. అలాంటిది నేడు వర్షం కురిస్తే రాష్ట్రం నుంచి మొదటి ఫోటో మచిలీపట్నం నుంచే వస్తుంది. రహదారులు ఇప్పటికీ చెరువుల్ని తలపిస్తాయి.
• కార్పొరేషన్… పోర్టు అన్నారు… బందరులో అభివృద్ధి ఏదీ?
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గీతలు గీసుకుంటూ.. నిధులు వచ్చాయి. కార్పోరేషన్ వచ్చింది. పోర్టు వచ్చిందని చెబుతున్నారు. బందరులో మార్పు ఎక్కడ వచ్చింది. పోర్టు వస్తే నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. కానీ వనరులు ఉన్నా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కార్పొరేషన్, పోర్టు అన్నారు.. అభివృద్ధి మాత్రం ఎక్కడ ఉంది? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా నేటికీ కొన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రజలు ఇంకా కొట్లాడుతున్న పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు సేవ చేయలేకపోతున్నారో ఆలోచించండి. మచిలీపట్నంలో ప్రారంభం అయిన ఆంధ్రా బ్యాంకు విలీనం చేసేస్తుంటే ప్రశ్నించే వారు లేరు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యు ఉన్నా మాట్లాడలేదు. అటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకున్నాం. విభజన సమయంలోనూ అంతా నిస్సహాయంగా ఉండాల్సి రావడం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బాధించింది. మనం రాష్ట్రం కోసం ఎవరూ నిలబడలేదు అన్న ఆలోచన పార్టీ పెట్టేలా చేసింది. రాజకీయ పార్టీగా మనం కష్టపడి ఎదుగుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా మంచి మార్పు తీసుకువచ్చేలా ముందుకు ముందుకు వెళ్దాం. ఎలాంటి సమస్య మీద అయినా నిజాయితీగా మాట్లాడే శక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మాటిచ్చినప్పుడు బలంగా నిలబడతారు. మీరంతా నాయకులుగా ఎదగాలి. మచిలీపట్నం వేదికగా ఐదు రోజుల్లోనే ఆవిర్భావ సభ పెట్టి అద్భుతంగా చేసుకున్నాం.
• నిజాయతీగా పోరాడితే ప్రజలు ఆదరిస్తారు
రాజకీయాల్లో నిలకడగా నిలబడినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు చేయగలం. నివర్ తుపాను వచ్చినప్పుడు అవనిగడ్డ వరకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల్ని పరామర్శించారు. ప్రభుత్వానికి నెల రోజుల గడువిచ్చి రూ. 25 వేల చొప్పున ఇచ్చి ఆదుకోమన్నాం. దీక్షలు చేశాం. కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చాం. ఇలా ఒక అంశం మీద నిజాయతీగా పోరాటం చేస్తే ప్రజలు ఆదరిస్తారు. సమస్యపై నిజాయతీగా మాట్లాడే శక్తి.. మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తితో సోషల్ మీడియా వేదికగా కూడా పోరాటం చేయండి. స్వార్ధం లేకుండా పని చేసి అధ్యక్షుల వారి ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ఒక్క ఎన్నికల కోసం ఎవరూ ఆలోచించవద్దు. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభివృద్ధి చేసి చూపుదాం. మన ప్రస్థానం ఇంకా ముందుకు వెళ్లాలి. మీరు నిలబడిండి. అవనిగడ్డలో ఇంఛార్జ్ లేకున్నా అద్భుతంగా నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
• జనసేన బలం ఆపితే ఆగేది కాదు
మూడు కిలోమీటర్ల దూరంలో సభకు ఎవరూ రాకుండా ఆపేశారు. జనసేన బలం.. మీరు ఆపితే ఆగేది కాదు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతం కోసం సమష్టిగా నిలబడండి. సోషల్ మీడియాని పార్టీ కోసం ఉపయోగించండి. ప్రభత్వం సోషల్ మీడియాలో పోస్టులకి కావాలని కేసులు పెడుతోంది. ఫార్వాడ్ పోస్టులకు పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి అంతా జాగ్రత్తగా ఉండండి. జనసేనతో ఏ రాజకీయ పార్టీ పోటీ పడలేదు. మనం ఎన్నికల్లో గెలవాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. పార్టీని బలోపేతం చేసుకోవాలి. పొత్తుల విషయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. టీడీపీ చేసే కార్యక్రమాలకు సహకరించండి. మన కార్యక్రమాలకు వారిని ఆహ్వానించండి. ప్రజల కోసం అంతిమ పోరాటంలో నిలబడండి. జనసేనకు ఎందుకు ఓటు వేయాలనే అంశాన్ని ప్రజలకు వివరించండి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.