పునీత్ కళ్ళతో నలుగురికి కంటిచూపు..!

తాను మరణించి మరో నలుగురికి కంటిచూపును ప్రసాదించారు దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. ఆయన దానం చేసిన కళ్ళతో నలుగురికి కంటిచూపు దక్కింది. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్ళను ఇతరులకి ట్రాన్స్‌‌ప్లాంట్ చేస్తారు .. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంథులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు.

అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి సోమవారం తెలిపారు. దీనితో ఒకేరోజు నలుగురికి చూపు దక్కింది. చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరందరూ కర్ణాటకకి చెందినవారే. కాగా పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ మరణానంతరం 2006లో తన కళ్లను దానం చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో 2017లో పునీత్ తల్లి (పార్వతమ్మ రాజ్‌కుమార్) మరణం తర్వాత ఆమె కళ్లను కూడా దానం చేశారు. ఇప్పుడు వారి లగే పునీత్ కూడా తన కళ్ళను దానం చేశారు.