రైల్వే ప్రాజెక్టులు పూర్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

*రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయకపోవడమే అసలు సమస్య
*కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైంది. అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయి. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ అనేది నుంచో వింటున్నది. ఈ ప్రాజెక్టుకు 25% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్ళడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయి. ఈ రైల్వే లైను పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. అలాగే నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం – తుముకూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. నిధులు ఇవ్వరు, భూసేకరణ కూడా చేయరు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? మౌలిక వసతుల అభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది. ఇలాగైతే ఈ లైన్లు ఎప్పటికీ పూర్తవుతాయి.

విశాఖ రైల్వే జోన్ ప్రకటన అయినా అది కార్యరూపం దాల్చే విధంగా చేయడంలో వైసీపీ ఎంపీలు విఫలం అవుతున్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించలేరు… ప్రకటన అయిన జోన్ ను ముందుకు తీసుకువెళ్ళేందుకు చిత్తశుద్ధితో కృషి చేయలేరు. రైల్వే లైన్ల పూర్తికి ఆ శాఖ మంత్రి చెప్పిన సమాధానంలో అంశాలను ముఖ్యమంత్రికి వివరించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత వైసీపీ ఎంపీలపై ఉంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు.