రైతుబిడ్డ రవి దహియా విజయం కోసం పోరాడిన తీరు ప్రశంసనీయం: పవన్ కల్యాణ్

టోక్యో ఒలింపిక్స్ లో 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత వస్తాదు రవికుమార్ దహియా రజతం సాధించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. హర్యానాకు చెందిన రైతుబిడ్డ రవి దహియా టోక్యో ఒలింపిక్స్ లో విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. రెజ్లింగ్ లో రజతం సాధించి దేశానికి మరో పతకం అందించిన రవి దహియాకు తన తరుఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు పవన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ క్రీడా ఆణిముత్యం రెజ్లింగ్ లో ఎదిగిన తీరు, అతని క్రీడా ప్రస్థానం యువతకు ఓ స్ఫూర్తి పాఠం అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రవి మరిన్ని ఘన విజయాలు సొంతం చేసుకుని దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తాడని ఆశిస్తున్నట్టు తెలిపారు.