అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకున్నాయి

* అన్నయ్య ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పాలన పగ్గాలు చేపడతారు
* జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు

“మేమిద్దరం చెరో వైపు ఉండడం కంటే తాను తప్పుకోవడమే తన తమ్ముడు మరింతగా ఉద్భవించడానికి ఉపయోగకరం అవుతుందేమోననే రాజకీయాల నుంచి తప్పుకున్నాను..” అని అన్నయ్య చిరంజీవి గారు చాలా ఉన్నతత్వంతో చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి లాంటి నిబద్ధత వున్న నాయకుడు పరిపాలన పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య గారి ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని, జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని నాగబాబు అన్నారు. నా తమ్ముడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని, పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని అన్నయ్య చెప్పిన మాటలు జన సైనికులకు, వీర మహిళలకు మనో ధైర్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన వుంటారనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నయ్య చెప్పిన మాటలకు అనుగుణంగా జన సైనికులు, వీర మహిళలు మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు కోరారు.