పునీత్ కి నివాళులు అర్పించి.. కంటతడి పెట్టుకున్న చిరు..

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలియసందే. ఆయన్ను చివరిసారిగా చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. పెద్ద ఎత్తున అభిమానులు బెంగుళూరు చేరుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి స్టార్లు పునీత్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి కూడా బెంగుళూరుకి వెళ్లారు. ఆయనతో పాటు వెంకటేష్, శ్రీకాంత్, అలీ.. పునీత్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కడే ఉన్న శివరాజ్ కుమార్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. కన్నీటి పర్యంతమవుతున్న ఆయనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు.

అనంతరం అలీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మంచి వాళ్లను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతారని విన్నాను.. కానీ పునీత్ విషయం చూశానని అన్నారు. భగవంతుడి నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. ఒక మంచి మనిషిని, నటుడిని ఇండస్ట్రీ కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు.. మూడు నెలల క్రితమే ఇద్దరు కలిశామని.. తనను ‘అన్నా’ అని పిలుస్తారని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.