సొంత జిల్లాకు ఏమీ చెయ్యని ముఖ్యమంత్రి… రాష్ట్రానికి ఎం చేస్తారు…?

సొంత జిల్లాను పట్టించుకోని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారు?

• ఎన్నికలు వస్తే మండలానికో మంత్రి… గ్రామానికో ఎమ్మెల్యేను పంపిస్తారు
• విపత్తులు సంభవిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు?
• ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారు
• ఇసుక మాఫియా వల్లే కడప జిల్లాలో విపత్తు
• కడప జిల్లాలోని వరద బాధిత గ్రామాల్లో జనసేన పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన

వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు చెట్ల కింద బతుకుతుంటే ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోవడం చాలా దురదృష్టకరమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్. సొంత జిల్లాకి కష్టం వస్తే స్వయంగా పర్యటించలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. హెలీకాప్టర్ వేసుకువచ్చి తిరిగి వెళ్లిపోయి ఎక్కడో కూర్చుని కబుర్లు చెబితే ఎలా అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దెబ్బ తిన్న గ్రామాల్లో పర్యటించి భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం శ్రీ మనోహర్ పర్యటించారు. అన్నమయ్య డామ్ కట్ట దిగువ ప్రాంతంలో వరద ముంపుకు గురైన నందలూరు మండలం తొగురుపేటలో బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. వరద తీవ్రత, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. బాధితులకు నిత్యావసరాలు, దుప్పట్లు, పాత్రలు అందించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “ఎన్నికలు వస్తే మండలానికో మంత్రిని, గ్రామానికో శాసనసభ్యుడిని పంపే పాలకులు ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం అందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని స్పష్టం చేశారు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతే ప్రజలకు సాయం అందించడానికి మండలానికో మంత్రిని ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఇంత విపత్తు వస్తే సహాయం కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయలా ఇచ్చేది? ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే స్థానికంగా ఉన్న నాయకులు ఏమయ్యారు? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇతర గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సాటి వారికి సాయం అందిస్తుంటే ప్రభుత్వం నుంచి ఎందుకు సహాయ కార్యక్రమాలు లేవో తెలియడం లేదు.

• ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను దూషించేవాళ్లు.. ప్రజల కష్టాలకు స్పందించరా?


సీఎం లక్షల కోట్ల బడ్జెట్ అని పెద్దపెద్ద మాటలు చెబుతారుగానీ సొంత జిల్లాలో మాత్రం పర్యటించ లేరు. ఇంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి ఉంటుందా. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు, గుళ్ళు కొట్టుకు పోయాయి, రహదారులు, చెట్లు, పశుసంపద పోయింది. పొలాలు పోయాయి. నాలుగు రోజులుగా కనీసం వైద్య సదుపాయాలు లేవు. ఇప్పటి వరకు గ్రామాలకు కరెంటు సదుపాయం కూడా పునరుద్ధరించ లేదు. చిన్నపిల్లలతో బిక్కుబిక్కు మంటూ ఆరుబయట ఇసుకలోనే కాలం వెళ్లదీసే పరిస్థితి కనిపిస్తోంది. కడప నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అందరికంటే పెద్ద మంత్రి ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఏమైనా ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను దూషిస్తారు. ప్రజలకు కష్టం వస్తే మీరెందుకు రావడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజలు కలెక్టర్ కి, ఆర్డీవోకి ఓటు వేశారా? మంచి పాలన అందిస్తారని శ్రీ జగన్ రెడ్డి గారిని సొంత కుమారుడిగా భావించి ఆశీర్వదించి ప్రజలు ఓటు వేశారు. 151 సీట్లు కట్టబెడితే ఇలా ప్రవర్తించడం చాలా బాధ కలిగిస్తోంది. ఇళ్లు కొట్టుకుపోయి మహిళలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఏమైపోయారో తెలియడం లేదు.

• ఇసుక మాఫియా స్వార్థంతోనే విపత్తు

మానవ తప్పిదం కారణంగానే ఈ విపత్తు వచ్చింది. కేవలం ఇసుక మాఫియా స్వార్ధం కారణంగానే గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. ఈ విపత్తు మానవ
తప్పిదం. వారి వ్యాపారాల కోసం, ఇసుకను దోచుకోవడం కోసం నీటిని ఆపేసి ఇంతటి దారుణ విలయానికి కారకులయ్యారు. ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారు. మీరు సంపాదించింది సరిపోక దోచుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటే మిమ్మల్ని ఏమనాలి. ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం. పరిపాలనా దక్షత లేని ముఖ్యమంత్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి నుంచి రెండు వీడియో కాల్స్ పెట్టుకుని అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారు.

• పాదయాత్ర చూసి మురిసినవాళ్ళు ఓసారి ఇటు చూడండి

ఈ రోజు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ జనసేన బాధిత ప్రజల మధ్యకు వచ్చాం. గ్రామాల్లో పర్యటించి బాధితుల్ని మనవంతు ఆదుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సర్వస్వం కోల్పోయిన వారి కోసం పార్టీ తరఫున నిత్యావసర సరుకులు, వస్తు సామాగ్రి, దుప్పట్లు అందచేస్తున్నాం. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మొదటి విడత జనసేన పార్టీ పర్యటనల్లో భాగంగా వరద నష్టాన్ని అంచనా వేసిన తర్వాత రెండో విడత శ్రీ పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తారు. ఇక్కడ ఉన్న అధ్వాన్నమైన పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. శ్రీ జగన్ రెడ్డి గారి పాదయాత్ర చూసి మురిసిపోయిన వారంతా ఇక్కడికి వచ్చి ప్రజల దుస్థితి చూడండి. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయ”న్నారు. తొగురుపేట వెళ్ళేందుకు ముందుగా చొప్పవారిపల్లె వద్ద బస్సులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రయాణీకులు గల్లంతైన ప్రాంతాన్ని శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీనాయకులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్, డా.పసుపులేటి హరిప్రసాద్, శ్రీ తాతంశెట్టినాగేంద్ర, శ్రీ ముకరం చాంద్, శ్రీ సుంకర శ్రీనివాస్, డా.వెంకట సుబ్బయ్య, శ్రీ మలిశెట్టివెంకటరమణ, శ్రీమతి పత్తిపాటి కుసుమకుమారి, శ్రీ కనకరాజు, శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, శ్రీ కిరణ్ రాయల్, డా.బొడ్డేపల్లి రఘు, డా.పాకనాటి గౌతమ్ రాజ్, శ్రీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.