చిరంజీవి యువత ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

విజయనగరం: విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా ప్రిన్స్ “వరుణ్ తేజ్” జన్మదిన వేడుకలు శుక్రవారం జీఎస్ఆర్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు హాజరై బర్త్ డే కేక్ కట్ చేశారు. అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. తన వైవిధ్యమైన నటన, డైలాగ్ డెలివరీతో ఓ మంచి నటుడిగా గుర్తింపు పొందారన్నారు. ఎన్నో విభిన్న కథలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మెగా హీరోలు చేస్తున్న నిస్వార్థ సేవలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక కొందరు వైసీపీ అజ్ఞానులు చిరంజీవి, వారి కుటుంబ సభ్యులపై అవాక్కులు, చవాకులు వాగుతుంటారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
మెగాభిమానులకు సేవాస్పూర్తిని నింపి నడిపించే దీపం చిరంజీవి అని కొనియాడారు. మెగాభిమానులు ఎప్పుడూ సేవల్లో ముందుంటారని, మెగా హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు పాటుపడతారన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత సభ్యులు ఏంటి రాజేష్, రంగూరి భరత్ బాబు, గొల్లపల్లి మహేష్, సిరిపురపు దేవుడు, వేంకటేష్ నాయుడు, భార్గవ్, దిలీప్, కుమార్, రాంకుమార్, పెంటయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు పిడుగు సతీష్ పట్టణ నిరాశ్రయుల భవనంలో ఉన్న వృద్దులమధ్య వేడుకలను నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.