నేటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌పై విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో నేటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ లోని ఏజీస్‌ బౌల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..  ఈ ఫైనల్ కూడా ఓ సాధారణ మ్యాచ్ వంటిదేన‌ని చెప్పాడు.

చరిత్రను పరిశీలిస్తే ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారని, టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్‌ గెలిచినా, ఓడినా, ఈ క్రికెట్‌ ఇక్కడితో ఆగిపోదని విరాట్ కోహ్లీ తెలిపాడు. అందుకే ఈ మ్యాచ్‌ను మరీ ప్రత్యేకంగా ఏమీ చూడటం లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం బయటవాళ్లు మాత్రమే ఆత్రుత పడుతూ, చావోరేవో అన్నట్టు భావిస్తారని చెప్పుకొచ్చాడు.  

తాము కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నామ‌ని, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా దానినే ఇకపై కొనసాగిస్తామ‌ని విరాట్ కోహ్లీ చెప్పాడు. తాము 2011 ప్రపంచకప్‌ గెలిచామ‌ని,  గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని తెలిపాడు.

వాతావరణ ప‌రిస్థితులు త‌మ‌ జట్టు కూర్పును మార్చలేదని, తాము అన్ని విభాగాలను కవర్‌ చేశామ‌ని విరాట్ కోహ్లీ తెలిపాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు సరిచూసుకున్నామ‌ని, పటిష్ఠమైన జట్టునే బరిలోకి దింపుతున్నామ‌ని తెలిపాడు. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఏం చేయాలో, ఏం చేయకూడ‌దో స్పష్టంగా నిర్ణయించుకున్నామ‌ని చెప్పాడు.

త‌మ జ‌ట్టు కుర్రాళ్లు ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించారని విరాట్ కోహ్లీ గుర్తు చేశాడు. ఈ ఫైనల్‌ చేరుకొనేందుకు తామెంత కష్టపడ్డామో అందరికీ తెలుసని తెలిపాడు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పద్ధతిని మధ్యలో మార్చడం సరికాదని చెప్పాడు. క‌రోనా వేళ‌ ఆటగాళ్లంతా ఇళ్లలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశాడు.