సంపద సృష్టికర్తలు మన కార్మికులు

కార్మికుల స్వేదం చిందకపోతే ఏ దేశమైనా, ఏ జాతయినా అభివృద్ధి పథాన పయనించజాలదు అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభివర్ణించారు. ఎక్కడ శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తుందో… ఎక్కడ కార్మికులు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తారో అక్కడ సమాజం సిరి సంపదలతో అలరారుతుంది. కుల, జాతి, వర్గ భేదాలకు అతీతంగా కార్మికులందరూ ఐక్యంగా జరుపుకొనే వేడుక మేడే. దేశాన్ని కాపాడే సైనికులు, అందరికీ అన్నంపెట్టే రైతులతోపాటు ఆ స్థాయిలో గౌరవించవలసిన వారు మన కార్మికులు. దేశ సౌభాగ్యం కోసం ఎండనకా వాననకా, కాలాలకు అతీతంగా నిద్రాహారాలు మాని దేశం కోసం అహరహరం కష్టించి, శ్రమించే కార్మికులందరికీ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన మేడే శుభాకాంక్షలు. కార్మిక లోకమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని తెలిపారు.