నాపై జరిగింది యాక్సిడెంట్ కాదు.. హత్యాయత్నం
విజయవాడ: నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్పై గురువారం తన కారు యాక్సిడెంట్కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆమె విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనది యాక్సిడెంట్ కాదని, కొందరు దుండగులు కావాలనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లపాటు సహజీవనం చేశాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆమె గతంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈకేసుని ఉపసంహరించుకోవాలని ఆయన బెదిరింపులకు దిగుతున్నాడని, తనకు అతని నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆ మధ్య మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేసుకి, విజయవాడ ఘటనకి సంబంధం ఉందని ఆమె విజయవాడలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. తనని హత్య చేసే క్రమంలోనే యాక్సిడెంట్ చేయించి ఉంటాడని, తనకు శ్యామ్ కె నాయుడిపై అనుమానం ఉందని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.