వైసీపీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా?

• జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటాం
విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న మా పార్టీ కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్ ని చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియచేస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగం. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రాణ హాని తలపెట్టారు. విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్ నిర్మించడంపై, దసపల్లా భూముల వ్యవహారం, టిడిఆర్ స్కామ్, టైకూన్ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలు నిర్మించడం లాంటి అనేక వైసీపీ నేతల అక్రమాలపై శ్రీ మూర్తి యాదవ్ పోరాడుతున్నారు. జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారు. ఆయనకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. మూర్తి యాదవ్ కి ప్రాణ హాని తలపెట్టినవారిపై తక్షణమే పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకు ఏ చిన్నపాటి హాని కలిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని జనసేనాని హెచ్చరించారు.