పవన్ కళ్యాణ్ తో మేము సైతం అంటున్న ఎన్.అర్.ఐ. జన సైనికులు

* పిఏసీ సభ్యులు నాగబాబు సమక్షంలో రూ. 17 లక్షల చెక్ జనసేన పార్టీకి అందజేసిన శరభయ్య

Avatar


ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చేయూతగా మేము సైతం అంటూ యూ.ఎస్.ఏ. నుండి ఎన్.అర్.ఐ. జన సైనికులు రూ. 17 లక్షలు జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు. శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు, పార్టీ నాయకులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు సమక్షంలో శ్రీ శరభయ్య గారు చేతుల మీదుగా రూ. 17 లక్షలు చెక్ రూపంలో జనసేన పార్టీకి అందజేశారు. యూ.ఎస్.ఏ.లో నివాసం ఉంటున్న ఎన్.ఆర్.ఐ. స్వామి అనిశెట్టి ఆధ్వర్యంలో శరభయ్య పొలకం, కిరణ్, సాయి రాజ్, రాజేష్, నాగు కూనసాని నేతృత్వంలో విరాళం నిధులు సేకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 వేల మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ వారి పిల్లల విద్య, భవిష్యత్తు అవసరాలకు కూడా చేయూతనిస్తున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ సహాయ నిధికి రూ. 1 కోటి, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 50 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారని, మిలిటరీ వెల్ఫేర్ ఫండ్ కోసం రూ. 1 కోటి, వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు, వృద్దులు, దివ్యాంగులు.. ఇలా ఎంతోమందికి లెక్క కట్టలేనన్ని సహాయ సహకారాలు చేస్తున్నారని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రవాస భారతీయులు అడపా దడపా తమ వంతు చేయూతను అందించడం అభినందనీయమని., మీరిచ్చే ప్రతీ పైసా జనసేన పార్టీ ద్వారా ప్రజా సంక్షేమానికి వినియోగించబడుతుందని భరోసానిచ్చారు.
• “నా సేన కోసం-నా వంతు”కు ఎన్.ఆర్.ఐ. రూ. 1 లక్ష చెక్ అందజేత
“నా సేన కోసం-నా వంతు” కార్యక్రమంలో భాగంగా చికాగోలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు శ్రీ జీ. నాగరాజు రూ. 1 లక్ష జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు. నాగరాజు గారి తల్లి గారు శ్రీమతి రామలక్ష్మమ్మ, శ్రీమతి లావణ్య, కుమార్తె నాగకృతిక చేతుల మీదుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారు సమక్షంలో చెక్ రూపంలో జనసేన పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు గారు నాగరాజు గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు.