15 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి 25 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 15న విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 16న ధ్వజారోహణము, 21న స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 22న తిరుకల్యాణోత్సవం జరుగనున్నాయి.

కల్యాణోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 23న స్వామివారి దివ్య వాహన రథోత్సవం, 24న మహాపూర్ణాహుతి, చక్రతీర్థ పూజలు, 25న అష్ఠోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహోత్సవాల సందర్భంగా 11 రోజులపాటు బాలాలయంలో స్వామివారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి 25 వరకు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.