టీడీపీ మద్దతుదారుడికి ఓటు వేశారంటూ నలుగురిపై దాడి..

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడికి ఓటేసిన కొందరిపై వైసీపీ కార్యాకర్తలు దాడిచేసి చితకబాదారు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లిలో జరిగిందీ ఘటన. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన  పాలకుంట గంగులయ్య, పి.నరసమ్మ, ఆంజనేయులు, బి.రామసుబ్బమ్మలపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. 

గాయపడిన వీరిని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామసుబ్బమ్మ, ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతాప్‌రెడ్డి అనే అభ్యర్థి తనకు ఓట్లేయలేదన్న అక్కసుతో ఈ దాడికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపించారు. ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.