రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?

• సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి
గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్య ఘటన కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేశారు, వాటిని సరిచేయమని ఆంజనేయులు నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా స్పందించకపోవడంతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతుల భూముల వివరాలను పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడమే ఒక పొరపాటు అయితే వాటిని సరి చేయకుండా ఆ రైతులను తమ చుట్టూ తిప్పించుకొంటున్న అధికారుల ధోరణిని కచ్చితంగా తప్పుబట్టాలి. రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు… వాటికి బాధ్యులుగా గ్రూప్ వన్, ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండి ఏం లాభం? ఆంజనేయులు ఈ 7వ తేదీన గుంటూరు కలెక్టర్ దగ్గరకు పురుగుల మందు డబ్బాపట్టుకొని వెళ్ళి మరీ తన గోడు చెప్పుకొన్నారు. కలెక్టర్ ఈ సమస్యను పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం విలువ ఒక రైతు ప్రాణం. రైతులకు సంబంధించి అనేక పనులు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయి. ఆ శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు మానసిక క్షోభను కలిగిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అయినా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రైతుల క్షోభను తీర్చడంలో పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టడం లేదు. పాస్ పుస్తకాల జారీ నుంచి పంట నష్ట పరిహారం వరకూ రైతులకు సంబంధించిన పనులను చేసిపెట్టడంలో రెవెన్యూ సిబ్బంది సమాజానికి ఆహారం అందించే ఒక కష్ట జీవి కోసం బాధ్యత నిర్వర్తిస్తున్నామని భావించాలి. ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. ఈ రైతును గత నాలుగేళ్ళు తిప్పించుకొని సమస్యను పరిష్కరించని అధికారులను… తాజాగా కలెక్టర్ ఆదేశించినా నిర్లక్ష్యం వహించినవారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.